ఒక అధికారికి ఒకే ప్రభుత్వ వాహనం.. కేంద్రం కీలక నిర్ణయం
ప్రభుత్వ నిధులు, వనరుల దుర్వినియోగాన్ని అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా ప్రతి అధికారికి ఒకే ప్రభుత్వ వాహనం మాత్రమే కేటాయించాలని స్పష్టం చేసింది. ఒకే అధికారి పేరుతో ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ వాహనాలు వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించింది.
సీనియర్ అధికారులు అయినా, అదనపు శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నా ఈ నిబంధనకు ఎలాంటి మినహాయింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని శాఖలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రభుత్వ వాహనాల వినియోగంపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహించాలని సంబంధిత మంత్రిత్వ శాఖలకు సూచించింది.
ఈ నిర్ణయంతో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంతో పాటు, వాహనాల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించడం, పరిపాలనలో పారదర్శకతను పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.