పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం అండ
57 మంది బాధిత కుటుంబాలకు రూ.21 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
నూజివీడు, మే 18: పేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, ఒక పట్టణానికి చెందిన 57 మంది బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు రూ.21 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో మంత్రి అందజేశారు.
చాట్రాయి మండలానికి చెందిన 12 మందికి రూ.3.86 లక్షలు, ఆగిరిపల్లి మండలంలోని 11 మందికి రూ.3.52 లక్షలు, ముసునూరు మండలంలోని 9 మందికి రూ.3.81 లక్షలు, నూజివీడు రూరల్ ప్రాంతంలోని 18 మందికి రూ.6.55 లక్షలు, నూజివీడు పట్టణానికి చెందిన 7 మందికి రూ.3.22 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ సంజీవనిలా పనిచేస్తోందన్నారు. డబ్బులు లేక ఎవరూ వైద్యం నుంచి దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల పూర్తి ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
గతంలో వైద్యం చేయించుకుని బిల్లులు చెల్లించిన వారు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. వైద్య ఖర్చుల బిల్లులను తన కార్యాలయంలో అందజేస్తే వెంటనే ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య పరికరాలు, నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో కూటమి నాయకులు, కార్యకర్తలు సీఎం రిలీఫ్ ఫండ్పై ప్రజలకు అవగాహన కల్పించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు.
సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందుకోవడంతో బాధిత కుటుంబాలు మంత్రి పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తమ కుటుంబాలకు అండగా నిలిచారని భావోద్వేగంగా పేర్కొన్నారు.