ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 87 ఫిర్యాదులు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 87 ఫిర్యాదులు
విజయవాడ, మార్చి 23: ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో 87 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఇన్చార్జ్ పోలీస్ కమిషనర్ సర్వ శ్రేష్ఠ త్రిపాటి, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ ఎ.బి.టి.ఎస్. ఉదయారాణి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు, వారితో నేరుగా మాట్లాడి సమస్యలపై అవగాహన పొందారు. భూ, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి అత్యధికంగా నమోదయ్యాయి. మహిళా సంబంధిత కేసులు, కుటుంబ కలహాలు, మోసాలు, దొంగతనాలు, కొట్లాటలు వంటి వివిధ అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి.
ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులకు సూచనలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.