ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి
కరీంనగర్: ప్రజావాణికి వచ్చే అర్జీల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడేతో కలిసి ఆమె ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుండి ఆశతో వచ్చే బాధితులకు అధికారులు అండగా నిలవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను ఓపికగా విన్న కలెక్టర్, వెంటనే పరిష్కారమయ్యే అంశాలపై అక్కడికక్కడే అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వృద్ధులు, దివ్యాంగుల చెంతకే కలెక్టర్:
మానవీయ కోణంలో ఆలోచిస్తూ, కలెక్టర్ చిత్రా మిశ్రా స్వయంగా వృద్ధులు మరియు దివ్యాంగుల వద్దకు వెళ్లి దరఖాస్తులను స్వీకరించడం అందరినీ ఆకట్టుకుంది. నేటి ప్రజావాణిలో వివిధ సమస్యలపై మొత్తం 290 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, హుజురాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.