7న అమ్మవారికి కుంభోత్సవం
7న అమ్మవారికి కుంభోత్సవం
లోక కల్యాణం కోసం శ్రీ భ్రమరాంబాదేవి వారికి వారికి ఈ నెల 7న ( మంగళవారం రోజున) కుంభోత్సవం జరుగనున్నది.
ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్త్వికబలిని సమర్పించేందుకు ఈ ఉత్సవం నిర్వహించబడుతోంది.
ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశి మొదలైనవి అమ్మవారికి సాత్త్వికబలిగా సమర్పించబడుతాయి.
ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం గం. 5.00లకు ప్రాత:కాలపూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజలను, జపపారాయణలను నిర్వహిస్తారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ ఎప్పటివలనే ఏకాంతంగానే జరిపించబడుతాయి.
కొబ్బరికాయలు – గుమ్మడికాయల సమర్పణ :
ఈ పూజాదికాల తరువాత ఉదయం గం. 7.30లకు శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు మొదటి విడత సాత్వికబలిగా సమర్పించబడుతాయి.
కోటమ్మవారి పూజలు :
ఉదయం గం. 9.30లకు హరిహరరాయగోపురద్వారం వద్ద గల మహిషాసురుమర్థినిఅమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేకపూజాదికాలను జరిపించి సాత్త్వికబలిగానే కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతుంది.
శ్రీ స్వామివారికి అన్నాభిషేకం :
ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం శ్రీ మల్లికార్జునస్వామివారికి ప్రదోషకాలపూజల అనంతరం గం. 5.30లకు అన్నాభిషేకం జరిపించబడుతుంది. అనంతరం శ్రీస్వామివారి ఆలయద్వారాలు మూసివేయబడుతాయి.
కుంభహారతి :
స్వామివార్ల పూజల అనంతరం అమ్మవారికి ఎదురుగా ప్రదక్షిణ మండపములో అన్నాన్ని కుంభరాశిగా వేయబడుతుంది. అదేవిధంగా సింహ మండపం వద్ద కూడా భక్తులు అమ్మవారికి కుంభరాశిని సమర్పిస్తారు.
సాయంత్రం గం. 6.15ల నుంచి సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీవేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించడంతో ఉత్సవంలోని ప్రధానఘట్టం ప్రారంభమవుతుంది.
ఈ కుంభహారతి సమయములోనే అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలు అమ్మవారికి సమర్పించబడుతాయి. ఈ పసుపు,కుంకుమల సమర్పణకే “శాంతి ప్రక్రియ” అని పేరు.
ఈ సందర్భముగా కూడా రెండవ విడత సాత్వికబలిగా అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించబడుతాయి.
కుంభహారతి సమర్పణ తరువాత రాత్రి గం. 7.00ల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించడం జరుగుతుంది.
మహానివేదన :
ఈ ఉత్సవం సందర్భంగా అమ్మవారికి పలురకాల వంటకాలతో మహానివేదనగా సమర్పించబడుతుంది.
జంతుబలి నిషేధం :
దేవదాయ చట్టముననుసరించి క్షేత్ర పరిధిలో జంతు మరియు పక్షి బలులు పూర్తిగా నిషేధించబడ్డాయి. కాబట్టి జంతుబలుల నిషేధం కట్టుదిట్టంగా అమలు చేయబడుతోంది.
ఈ చట్టం ప్రకారం జంతుబలులు నిర్వహించడమే కాకుండా జంతుబలులకు ప్రత్యక్షంగా కానీ మరియు పరోక్షంగా కానీ సహకరించడం కూడా నేరంగా పరిగణించడం జరుగుతుంది.
జంతు/పక్షి బలి నిషేధాన్ని గురించి భక్తులలో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా (మైకుద్వారా) జంతుబలి నిషేధాన్ని గురించి విస్తృత ప్రచారం చేయడం జరుగుతోంది. క్షేత్రపరిధిలో జంతుబలి నిషేధం గురించి అవగాహక కల్పించేందుకు పలుచోట్ల బోర్డులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
సిబ్బందికి ప్రత్యేక విధులు :
జంతు / పక్షి బలుల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు దేవస్థాన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించబడ్డాయి.
ఆలయమాడవీధులు, అంకాళమ్మ ఆలయం, బయలువీరభద్రస్వామి ఆలయం, క్షేత్రపరిధిలోని మహిషాసురమర్థిని అమ్మవారు, సుంకులమ్మ అమ్మవారు, అమ్మవారి విగ్రహాలు నెలకొల్పబడిన ప్రదేశాలు మొదలైనచోట్ల సిబ్బంది ప్రత్యేక విధులను నిర్వహిస్తారు.
స్థానిక రెవిన్యూ మరియు పోలీస్శాఖల సహకారముతో జంతు / పక్షి బలుల నిషేధానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోబడ్డాయి.
అదే విధంగా ఉత్సవ నిర్వహణకు కూడా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించబడ్డాయి.
కుంభోత్సవం రోజున కల్యాణోత్సవం నిలుపుదల
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఎప్పటి వలనే కుంభోత్సవం రోజున శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం, ఏకాంత సేవ నిలుపుదల చేయబడ్డాయి.
అదేవిధంగా కుంభోత్సవం రోజున అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జితసేవలు కూడా నిలుపుదల చేయబడుతాయి.
( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)
శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ