ఫాసిస్ట్ శక్తులను ఓడించాలి.. వామపక్షాలే ప్రత్యామ్నాయం: డి హరినాథ్
కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ఎస్బీకే విజ్ఞాన భవనంలో నిర్వహించిన కామ్రేడ్ పర్చూరి సోమేశ్వరరావు 26వ వర్ధంతి సభలో డి హరినాథ్ కీలక ప్రసంగం చేశారు. 17 సంవత్సరాల పాటు సర్పంచిగా సేవలందించిన కామ్రేడ్ సోమేశ్వరరావు నిజాయితీకి ప్రతీకగా నిలిచిన మచ్చలేని నాయకుడని కొనియాడారు. దివిసిపిఐ ఎంఎల్ నేత కామ్రేడ్ షనకాబుచ్చి కోటయ్య సహచరుడిగా సోమేశ్వరరావు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తుచేశారు.
దేశంలో మతోన్మాద, ఫాసిస్ట్ శక్తులకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు దాసోహం అవుతున్నాయని హరినాథ్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ కూడా బీజేపీ భజన చేస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలు ద్వితీయ ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
ఉద్యమ చరిత్ర కలిగిన అమరవీరుల స్ఫూర్తితో ఫాసిస్ట్ శక్తులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాల ఫెడరల్ హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించడం లేదని విమర్శించారు. ఒకరు ఓటుకు నోటు కేసులో, మరొకరు ఈడీ కేసుల్లో చిక్కుకుని బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
జనసేన పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి దగ్గరైందని హరినాథ్ వ్యాఖ్యానించారు. యువత రాజకీయాల్లో సంచలన మార్పులు తీసుకొస్తోందని, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లో మార్పును కోరే కొత్త నాయకత్వం ముందుకు వస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమానికి పరుచూరి రాఘవేంద్రరావు అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం ఈశ్వర్, బండారు వెంకటేశ్వరరావు, పెరికే కాంతారావు తదితరులు పాల్గొన్నారు.