ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే లక్ష్యం: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
అన్నమయ్య జిల్లా, మదనపల్లి, జూన్ 08: ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన న్యాయం అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను స్వయంగా స్వీకరించిన ఎస్పీ, వారి సమస్యలను ఓపికగా విని సంబంధిత అంశాలపై విచారణ చేపట్టారు. కుటుంబ వివాదాలు, సైబర్ మోసాలు, భూ మరియు ఆస్తి తగాదాలు, నకిలీ పత్రాల వ్యవహారాలు, అధిక వడ్డీ వేధింపులు, ఆన్లైన్ మోసాలు, ప్రేమ పేరుతో మోసాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించారు.
అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడిన ఎస్పీ, ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో నిష్పక్షపాతంగా విచారించి బాధితులకు తక్షణ న్యాయం అందించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు తమ సమస్యలను సంబంధిత పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, డీఎస్పీ కార్యాలయాల్లో కూడా నమోదు చేయవచ్చని, అక్కడ స్వీకరించిన ఫిర్యాదులను సైతం పీజీఆర్ఎస్ ఫిర్యాదులుగానే పరిగణించి తగిన చర్యలు చేపడతామని తెలిపారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి నివేదికలను వెంటనే జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, బాధితులు నిర్భయంగా ముందుకు వచ్చి తమ ఫిర్యాదులను తెలియజేయాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పిలుపునిచ్చారు.