రైతు గుర్తింపు నంబర్ ప్రతి ఒక్కరికీ అవసరం
రైతు గుర్తింపు నంబర్ ప్రతి ఒక్కరికీ అవసరం ; వ్యవసాయ అధికారి గిరిబాబు NTODAY NEWS చిట్యాల
20వ తేదీలోపు ఏఈఓలను సంప్రదించాలి
-మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు విజ్ఞప్తి
ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, పీఎం కిసాన్ మరియు యాప్ ద్వారా యూరియా సరఫరా వంటి పథకాల ప్రయోజనాలను పొందాలంటే రైతులు తప్పనిసరిగా తమ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోవాలని చిట్యాల మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు సూచించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, మండలంలోని రైతులకు పలు కీలక సూచనలు చేశారు. చాలామంది రైతులకు సంబంధించి వ్యవసాయ శాఖ రికార్డుల్లో సరైన మొబైల్ నంబర్లు లేకపోవడం వల్ల పథకాల సమాచారం అందడం లేదని ఆయన పేర్కొన్నారు. రైతు సోదరులందరూ వెంటనే తమ పరిధిలోని రైతు వేదికలకు వెళ్లి, అక్కడ ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి తమ మొబైల్ నంబర్లను సరిచేసుకోవాలని కోరారు. అన్ని పథకాలకు ఒకే మొబైల్ నంబర్ ఉండేలా చూసుకోవడం వల్ల సమాచారం త్వరగా అందుతుందని తెలిపారు. ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి రైతుకు 'రైతు గుర్తింపు నంబర్' ఉండటం విధిగా ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ నంబర్ పొందని వారు వెంటనే ఏఈఓల వద్ద గానీ లేదా మీ-సేవా కేంద్రాల్లో గానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు అనర్హులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే వర్షాకాలంలో రైతులు మొబైల్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, దీనికోసం మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం అత్యంత ఆవశ్యకమని ఆయన వివరించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ నెల 20వ తేదీ లోపు పూర్తి చేసి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సాయాన్ని పొందాలని మండల వ్యవసాయ అధికారి కోరారు.