రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితం
రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితం: రైతు సంఘం విమర్శ
ఏలూరు, మే 16:
రైతుల పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల పెంపు మోసపూరితమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. సూర్యనారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. ఎరువుల ధరలను 15 నుంచి 20 శాతం వరకు పెంచేందుకు అనుమతి ఇచ్చి, పంటల మద్దతు ధరలను మాత్రం కేవలం 0.1 శాతం నుంచి 8 శాతం వరకే పెంచడం రైతులను మోసం చేయడమేనని అన్నారు.
శనివారం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 14 వ్యవసాయ పంటలకు మద్దతు ధరలు ప్రకటించిందని, అయితే అవి రైతులకు ఏమాత్రం ఉపశమనం కలిగించేలా లేవన్నారు. వరి, వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలకు స్వల్ప పెంపు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. గ్రేడ్-ఏ వరి ధరను రూ.2,389 నుంచి రూ.2,461కు, వేరుశనగను రూ.7,263 నుంచి రూ.7,517కు, మొక్కజొన్నను రూ.2,400 నుంచి రూ.2,410కు మాత్రమే పెంచారని తెలిపారు. పొద్దుతిరుగుడు, జొన్నలకు గరిష్టంగా 8 శాతం వరకు పెంపు ఇచ్చినా అది పెరిగిన పెట్టుబడి ఖర్చులకు సరిపోదన్నారు.
వ్యవసాయ ఉత్పత్తులపై 50 శాతం అదనపు ఆదాయం కలిపి ధరలు నిర్ణయించామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం రైతులను తప్పుదారి పట్టించడమేనని విమర్శించారు. మరోవైపు, కాంప్లెక్స్ ఎరువుల ధరలను బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకు పెంచుకునేందుకు ఎరువుల కంపెనీలకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. 20:20:0:13 ఎరువుల ధర రూ.1,500 నుంచి రూ.1,800కు, 10:26:26 ఎరువుల ధర రూ.2,025 నుంచి రూ.2,250కు పెరిగిందని తెలిపారు.
ఎరువుల ధరలు భారీగా పెరిగిన పరిస్థితుల్లో పంటల మద్దతు ధరలను స్వల్పంగా పెంచడం వల్ల రైతులకు నష్టం తప్ప లాభం ఉండదన్నారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయం (సి2)పై 50 శాతం అదనంగా కలిపి అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ధరలు ప్రకటించడమే కాకుండా ప్రభుత్వమే రైతుల పంటలను కొనుగోలు చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
2025-26 సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు వరి, మొక్కజొన్న, పత్తి, కందులు, మినుములు వంటి పంటలకు అమలు కాలేదని ఆరోపించారు. రానున్న ఖరీఫ్ సీజన్లోనైనా రైతులకు ప్రకటించిన మద్దతు ధరలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
నేవీ ఆయుధ డిపో భూసేకరణపై స్పందన
కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, మంగపతిదేవిపేట పరిసర గ్రామాల్లో ప్రతిపాదించిన నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని విరమించుకోవడం రైతుల పోరాట విజయమని రైతు సంఘం నేతలు పేర్కొన్నారు. రైతుల అనుమతి లేకుండా బలవంతపు భూసేకరణ చేయడం దుర్మార్గమని విమర్శించారు.
అభివృద్ధికి ఎవరూ వ్యతిరేకం కాదని, ఇప్పటికే సాగులో ఉన్న భూములను నాశనం చేసి కొత్త అభివృద్ధి పేరుతో భూసేకరణ చేయడం సరైంది కాదన్నారు. చివరకు ప్రభుత్వం భూసేకరణ నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం సంతోషకరమని తెలిపారు. పోరాటం చేసిన రైతులు, గ్రామాల ప్రజలను అభినందించారు.