రెండు ఫోటోల విధానంతో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు: వి నాగరాజు
ఉపాధి హామీ పథకం ద్వారా జీవనం సాగిస్తున్న కూలీలకు ఉపాధి దూరం చేయొద్దని, రెండు ఫోటోల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విస్సంపల్లి నాగరాజు డిమాండ్ చేశారు. విస్సన్నపేట మండలం కలగర గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్, గ్రూప్ ఫోటో, రెండు ఫోటోల విధానం కారణంగా ఉపాధి హామీ కూలీలు పనులకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
గత రెండు సంవత్సరాలుగా ఆంక్షల పేరుతో ఫేస్ యాప్ ద్వారా ఫోటోలు తీసే విధానం అమలు చేస్తున్న కారణంగా ఇప్పటికే సగానికి పైగా కూలీలు పనులకు దూరమయ్యారని తెలిపారు. ఫోటో నమోదు కోసం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు వేచి చూడాల్సి వస్తోందని, దీంతో కూలీల పనిదినాలు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ రెండు ఫోటోల విధానాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పని అవకాశాలు కల్పించాలని నాగరాజు కోరారు.
ఈ కార్యక్రమంలో విజయ్, సుబ్బారావు, లక్ష్మి తదితర ఉపాధి కూలీలు పాల్గొన్నారు.