సాగుకు బ్రేక్.. రైతులకు ఆందోళన.. దేశవ్యాప్తంగా 42% వర్షపాతం లోటు!
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్ ప్రారంభంలో ఆశలు రేకెత్తించిన వర్షాలు తర్వాత తగ్గిపోవడంతో సగటు వర్షపాతం 42 శాతం మేర లోటు నమోదైంది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
ముఖ్యంగా వర్షాధారిత వ్యవసాయ ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మహారాష్ట్రలో 82 శాతం, జార్ఖండ్లో 69 శాతం, ఛత్తీస్గఢ్లో 67 శాతం వర్షపాతం లోటు నమోదైంది. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే సగానికి పైగా వర్షాలు తగ్గాయి. దీంతో వరి, పత్తి, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు ఆలస్యమయ్యే ప్రమాదం ఏర్పడింది.
వర్షాలు లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ కాలంలో దిగుబడి వచ్చే సోయాబీన్, మొక్కజొన్న వంటి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంత రైతులు మరో రెండు వారాలు వర్షాల కోసం వేచి చూసి, పరిస్థితి మారకపోతే సోయాబీన్ సాగు చేపట్టాలని భావిస్తున్నారు.
అయితే కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. రాజస్థాన్లో సాధారణం కంటే 41 శాతం, ఆంధ్రప్రదేశ్లో 3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. పంజాబ్, హర్యానాలో కాలువలు, భూగర్భ జలాల ఆధారంగా వరి నాట్లు కొనసాగుతున్నాయి.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ 23 తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాల్లో రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర వ్యవసాయ శాఖ తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్న 197 జిల్లాలను గుర్తించి రైతులకు సహాయంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.