ఘనంగా జ్యోతిబా ఫూలే 199వ జయంతి వేడుకలు
సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతిని ఘనంగా నిర్వహించిన సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక
మంచిర్యాల: సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాత, భారత దేశపు అగ్ర శ్రేణి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతి వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం (11-04-2026) ఘనంగా నిర్వహించారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ముందుగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. విద్యను, జ్ఞాన సమపార్జనను జీవిత లక్ష్యాలుగా మలుచుకున్న మహాత్మా జ్యోతిబా ఫూలే, జ్ఞానం కొందరి గుత్తాధిపత్యం కాదని, ఆ శక్తి అందరికీ అందాలని చాటిన గొప్ప దార్శనికుడు అని కొనియాడారు. అక్షర జ్ఞానం అందని ద్రాక్షగా ఉన్న కాలంలోనే బాలికల కోసం, విద్యావకాశాలు లేని వర్గాల కోసం పాఠశాలలు తెరిచి విద్యా విప్లవానికి నాంది పలికారని గుర్తు చేశారు. నిరంతర సత్యాన్వేషణ, సామాజిక శ్రేయస్సు పట్ల అచంచలమైన అంకితభావం కలిగిన ఉదాత్త జీవితం ఆయనదని, సామాజిక సమానత్వం కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుని ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్నవారు:
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షులు ఆర్. రాజన్న, ప్రధాన కార్యదర్శి పి. నర్సయ్య, ఉపాధ్యక్షుడు ఏ. గంగన్న, నాయకులు మదరబోయిన మల్లేష్, మోతుకూరి రాంబాబు, ఇందూరి రామన్న, దోరిశెట్టి పోశయ్య, పోతురాజుల చంద్రయ్య, రసకట్ల రాజయ్య, ఎల్. రమేష్ లాల్, పులి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా "జోహార్ మహాత్మా జ్యోతిబా ఫూలే", "అమర్ హై జ్యోతిబా ఫూలే" అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు