సౌరవ్ దాస్పై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు..
సౌరవ్ దాస్పై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు.. "నీ వయసులోనే రెండు జాతీయ అవార్డులు సాధించా"
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జెన్-జీ నిరసనకారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్పై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అతడు పనికిరాని వ్యక్తి అని మండిపడుతూ, అతడి వయసులో తాను రెండు జాతీయ అవార్డులు సాధించానని పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే.. జెన్-జీ నిరసనకారులను "గట్టర్ జనరేషన్" (మురికి కాలువ తరం)గా కంగనా రనౌత్ పేర్కొనడంపై సౌరవ్ దాస్ స్పందించారు. "ఆమె వ్యాఖ్యలను సొంత పార్టీ నాయకులే సీరియస్గా తీసుకోరు. మేమెందుకు బాధపడాలి? ఆమె చెప్పే మాటలను జెన్-జీ, జెన్-ఆల్ఫా యువత పట్టించుకుంటుందని నేను అనుకోను. ఈ దేశానికి కంగనా చేసిన దానికంటే యువతరమే ఎక్కువ చేసింది. హిమాచల్ ప్రదేశ్ ఎంపీగా తన నియోజకవర్గానికి వెళ్లినప్పుడు చిన్న పనికే ఇబ్బంది పడుతూ తాను చేయలేనని చెప్పారు. ఆమె ఎంత సీరియస్గా ఉంటారో దీన్నిబట్టే అర్థమవుతుంది" అని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలకు కంగనా రనౌత్ సామాజిక మాధ్యమం వేదికగా ఘాటుగా బదులిచ్చారు. "ఈ వ్యక్తి కోసం నెట్టింట వెతికాను. 28 ఏళ్ల విద్యార్థి అని కనిపించింది. కానీ నాకు అది నమ్మశక్యంగా అనిపించలేదు. అవును.. నేను గత రెండేళ్లుగానే రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ 20 ఏళ్లుగా ప్రజాజీవితంలో కొనసాగుతున్నాను. అతడి వయసులోనే నేను రెండు జాతీయ అవార్డులు సాధించాను. నిజమే.. పార్లమెంట్ సభ్యురాలిగా నాకు పనిభారం ఎక్కువగా ఉందని చెప్పాను. ఎందుకంటే నేను ఎంపీ మాత్రమే కాదు.. దర్శకురాలు, నటి, నిర్మాత, కథా రచయిత్రి, వ్యాపారవేత్తగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
కానీ పనికిరాని, నిరుద్యోగి అయిన నీలాంటి వ్యక్తికి ఏ వయసులోనైనా బిజీగా ఉండటం అంటే ఏమిటో ఎప్పటికీ అర్థం కాదు. సౌరవ్.. నీది వ్యక్తిగత సమస్యే. నువ్వు విద్యార్థివి కాదు. ఇకనైనా ఏదైనా నైపుణ్యం నేర్చుకో" అంటూ కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారగా, పలువురు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు.