సెప్టెంబర్ 17 నాటికి ఇందిరమ్మ ఇళ్ల పూర్తి.. అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
హైదరాబాద్, జులై 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. ఫేజ్-1 కింద మంజూరైన 2.50 లక్షల ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని హౌసింగ్ శాఖకు స్పష్టమైన గడువు విధించింది.
ఇప్పటికే గోడలు, స్లాబ్ దశ వరకు చేరుకున్న ఇళ్ల నిర్మాణాన్ని ఆగస్టు 15 నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించింది.
ఇదిలా ఉండగా, ఫేజ్-2లో పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అందిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ఇప్పటివరకు 37 వేల దరఖాస్తులను సర్వే చేయగా, అందులో సుమారు 5 వేల మందిని అర్హులుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగంగా అమలు చేస్తోందని, నిర్దేశిత గడువులోపు నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హౌసింగ్ శాఖ అధికారులు తెలిపారు.