సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు సజీవదహనం
సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు సజీవదహనం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఒక రేకుల ఇంట్లో విద్యుదాఘాతం (షార్ట్ సర్క్యూట్) కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉండగానే ఇంట్లోని గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో మంటలు క్షణాల్లో ఇల్లంతా వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో బయటకు రాలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మృతులను అమ్మమ్మ వనం చంద్రకళ (45), మనవడు లక్ష్మణ్ (16), మనవరాలు ప్రణతి (14)గా గుర్తించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు