సిట్ దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
సిట్ దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. మద్యం రవాణా కేసులో పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన మద్యం రవాణా కేసులో సిట్ దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సిట్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానించింది. రెండేళ్లుగా కేసు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఏం గుర్తించారని ప్రశ్నించింది.
రాజ్ కేసిరెడ్డి అరెస్టు చట్ట విరుద్ధమని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరిన సిట్ వాదనలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ముందుగా సిట్ ప్రవర్తనను పరిశీలిస్తామని, ఆ తర్వాత హైకోర్టు తీర్పు అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సిట్ తప్పనిసరిగా పాటించాల్సిందేనని, లేదంటే కేసును కొట్టివేస్తామని హెచ్చరించింది.
కస్టడీయల్ ఇంటరాగేషన్ కోసం కోరుతున్న సిట్ వైఖరిపై కూడా సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. ఒకవైపు కస్టడీ కావాలని కోరుతూ, మరోవైపు పోలీసులు విచారణకు సిద్ధంగా లేరని చెప్పడం ఏమిటని నిలదీసింది.
రాజ్ కేసిరెడ్డి పోలీసు కస్టడీ విషయంలో సిట్ నిజంగా ఎంత సీరియస్గా ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే ప్రొడక్షన్ వారెంట్ కోరారని, ఇప్పటికే కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోయే అవకాశం లేదని పేర్కొంది. ఇది సిట్ అత్యుత్సాహం కాదా అని వ్యాఖ్యానించింది.
ప్రొడక్షన్ వారెంట్ అనేది అరెస్టు వారెంట్తో సమానమని సుప్రీంకోర్టు పేర్కొంది. రెండేళ్లుగా కేసు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కీలక విషయాలు బయటపెట్టలేకపోయారని వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉండగా కేసులో ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.