రోగాల అడ్డాగా మంచిర్యాల బస్టాండ్.. మురుగు పక్కనే ఇడ్లీ, దోశల పిండి.. ప్రయాణికుల ప్రాణాలతో హోటల్ యజమాని చెలగాటం
మంచిర్యాల (ఎన్టుడే న్యూస్):
అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ అపరిశుభ్రతకు నిలయంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస పారిశుద్ధ్య ప్రమాణాలు లేకపోవడంతో బస్టాండ్ ప్రాంగణం దుర్వాసన వెదజల్లుతుండగా, అక్కడే ఉన్న ఓ హోటల్ ప్రయాణికుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్లో చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బస్టాండ్ ఆవరణలోని ఓ హోటల్ నిర్వాహకులు ఇడ్లీ, దోశల పిండిని ఏకంగా మురుగు కాలువ (డ్రైనేజీ సంపు) పక్కనే తయారు చేస్తున్నట్లు బయటపడింది.
మురుగు నీటి సమీపంలో ఆహార పదార్థాల తయారీ జరుగుతుండటాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బస్టాండ్లో పారిశుద్ధ్య లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్న ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.