షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం!
షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం… తల్లి విజయమ్మ అఫిడవిట్తో రాజకీయాల్లో సంచలనం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం మరింత ముదిరింది. తల్లి వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తన సొంత కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన మనవరాళ్లు–మనవలకు అన్యాయం చేస్తున్నాడని ఆమె నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లో స్పష్టం చేశారు.
వైఎస్సార్ బ్రతికున్నంత వరకు ఆస్తుల పంపకం జరగలేదని, ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడి కుటుంబానికి చెందినవేనని ఆమె కుండబద్దలు కొట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆఖరి కోరిక ప్రకారం, కుటుంబంలోని నలుగురు మనవలు–మనవరాళ్లకు సమానంగా ఆస్తులు పంచాలని పేర్కొన్నట్లు గుర్తు చేశారు.
ఈ వివాదంలో వైఎస్ షర్మిల పిల్లలకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా అడ్డుకోవడం అన్యాయం అని విజయమ్మ తీవ్రంగా మండిపడ్డారు. సరస్వతి సిమెంట్స్ షేర్లు, అలాగే బెంగళూరులోని యలహంక ఇల్లు కూడా షర్మిలకే చెందుతాయని, ఇవి వైఎస్సార్ స్వయంగా నిర్ణయించిన విషయాలేనని ఆమె అఫిడవిట్లో పేర్కొన్నారు.
“ఇది బహుమతి కాదు… హక్కు!” అంటూ షర్మిల డిమాండ్ను విజయమ్మ బలపరిచారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటానే షర్మిల కోరుతోందని, దాన్ని వ్యక్తిగతంగా చూపించడం తగదని ఆమె స్పష్టం చేశారు.
తనను బినామీగా చూపిస్తూ జరుగుతున్న ప్రచారంపై కూడా విజయమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “దేవుడి సాక్షిగా నేను చెబుతున్నది నిజం” అంటూ, షర్మిల ఆస్తుల కోసం పోరాడుతున్నదనే ప్రచారం అబద్ధమని తేల్చి చెప్పారు.
ఇక ఈ కేసులో ఎన్సీఎల్టీ లో జగన్ వేసిన పిటిషన్కు కౌంటర్గా విజయమ్మ నేరుగా షర్మిల వైపు నిలవడం రాజకీయంగా పెద్ద మలుపుగా మారింది. జగన్ చెప్పిన “బహుమతి” వాదనను పూర్తిగా ఖండించిన ఆమె, వైఎస్సార్ వారసత్వంపై అందరికీ సమాన హక్కులు ఉండాలని డిమాండ్ చేశారు.
తల్లి–కొడుకు మధ్య న్యాయపోరాటం తెరపైకి రావడంతో, ఈ వ్యవహారం ఇక ఎటు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.