టీటీడీకి రూ.50 లక్షల విరాళాలు
తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని వివిధ ధార్మిక, సేవా ట్రస్టులకు మంగళవారం మొత్తం రూ.50 లక్షలకుపైగా విరాళాలు అందాయి. భక్తులు అందించిన ఈ విరాళాల డీడీలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అందజేశారు.
గుంటూరుకు చెందిన బృందా న్యూరో సెంటర్ తరఫున డాక్టర్ హనుమ శ్రీనివాస రెడ్డి, సిద్ధార్థ కలిసి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 చొప్పున మొత్తం రూ.30,00,348 విరాళంగా అందించారు.
అదేవిధంగా బెంగుళూరుకు చెందిన శ్రీపతి శ్రీనివాస్, కొటారు సునీల్ కలిసి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించగా, విశాఖపట్నానికి చెందిన చాగర్లమూడి సీతారామయ్య టీటీడీ బర్డ్ ట్రస్టుకు మరో రూ.10,00,116 విరాళంగా సమర్పించారు.
ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు సమక్షంలో విరాళాల డీడీలను ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు. భక్తులు ధార్మిక సేవా కార్యక్రమాలకు అందిస్తున్న సహకారం అభినందనీయమని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.