తెలంగాణ రైజింగ్తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: మంత్రి శ్రీధర్బాబు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి పరిశ్రమలే ప్రధాన బలం అవుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్తో రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ ఎకానమీ దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
శుక్రవారం కొండాపూర్ మండలం తొగర్పల్లిలో రూ.650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల్లో ఏర్పాటు కానున్న భారీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు మంత్రి శ్రీధర్బాబు, మంత్రి దామోదర రాజనర్సింహ భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో TGIIC చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ, కేజేఎస్ యూనిట్–II ద్వారా స్థానికంగా 1500 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమ పూర్తిగా కాలుష్య రహితమైందని చెప్పారు. తొగర్పల్లిలో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటుకు నిర్మలా జగ్గారెడ్డి, జగ్గారెడ్డి చేసిన కృషి కారణమని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. 2047 నాటికి దేశ జాతీయ ఉత్పత్తిలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచేలా కార్యాచరణ కొనసాగుతోందన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి పరిశ్రమలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఏర్పడ్డాయని గుర్తుచేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాకు BHEL, BDL, ODF వంటి కేంద్ర సంస్థలను తీసుకువచ్చామని తెలిపారు. ఈ కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమతో మహిళలకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందని అన్నారు.