తెలంగాణ రైతులకు శుభవార్త.. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్: తెలంగాణ రైతులకు ఊరటనిచ్చే వార్త. వ్యవసాయానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మళ్లీ చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
గత 15 రోజులుగా అనుకూల పరిస్థితులు లేక భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ వరకు మాత్రమే విస్తరించి నిలిచిపోయిన రుతుపవనాలు తాజాగా మళ్లీ వేగం పుంజుకున్నాయి. సోమవారం నాటికి అవి నిజామాబాద్ వరకు విస్తరించాయని, మంగళవారం నాటికి తెలంగాణ అంతటా పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదు నుంచి ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఎండల తీవ్రత తగ్గి, రైతులకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి.
సోమవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో కూడా రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వాతావరణ సూచనలను గమనిస్తూ వ్యవసాయ పనులు చేపట్టాలని అధికారులు సూచించారు. నైరుతి రుతుపవనాల పూర్తి విస్తరణతో రాష్ట్రంలో సాగు పనులు మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.