తెలంగాణ సచివాలయంలో 6వ అంతస్తుకు భోజనాలు బంద్.. రెండేళ్లుగా బిల్లులు పెండింగ్!
తెలంగాణ సచివాలయంలోని ఆరవ అంతస్తుకు భోజనాల సరఫరా నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. గత రెండేళ్లుగా క్యాటరింగ్ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.
గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంవో అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులు ఉదయం నుంచి రాత్రి వరకు విధుల్లో నిమగ్నమై ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఇతర ఆహార ఏర్పాట్లను ప్రత్యేకంగా కల్పించింది. అయితే బిల్లులు పెండింగ్లో ఉండటంతో సరుకులు కొనుగోలు చేయడమే కష్టంగా మారిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
కనీసం విడతల వారీగా అయినా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల విడుదల విషయంలో అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టేసుకుంటున్నారని, దీంతో విసుగు చెందిన కాంట్రాక్టర్ చివరకు ఆరవ అంతస్తుకు భోజనాల సరఫరాను నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామంపై సచివాలయ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం, ప్రధాన కార్యదర్శి, సీఎంవో అధికారులు, కీలక విభాగాల ఉద్యోగులు ఉండే ఆరవ అంతస్తుకే భోజనం అందని పరిస్థితి రావడం ప్రభుత్వ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.