తిరువూరు అభివృద్ధికి అమరావతిలో మంత్రులతో ఎమ్మెల్యే వరుస భేటీలు
తిరువూరు అభివృద్ధికి అమరావతిలో మంత్రులతో ఎమ్మెల్యే వరుస భేటీలు
అమరావతి, ఆగస్టు 6: తిరువూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా అమరావతి సచివాలయంలో వివిధ శాఖల మంత్రులను కలిసి అభివృద్ధి పనులకు సంబంధించిన వినతిపత్రాలను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సమర్పించారు. నియోజకవర్గ ప్రజల అవసరాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు, మంజూరులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి తిరువూరు నియోజకవర్గంలోని అర్హులైన పేద కుటుంబాలకు అధిక సంఖ్యలో గృహాలు, గృహ నిర్మాణ కాలనీలు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని కలిసి నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. హాస్టల్ భవనాల మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ఫర్నిచర్ వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త హాస్టళ్లను మంజూరు చేయాలని కోరారు.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ను కలిసి తిరువూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేయాలని, వైద్య సేవలను విస్తరించాలని, అవసరమైన వైద్య సిబ్బంది, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని వినతిపత్రం సమర్పించారు.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి త్వరలో ప్రారంభం కానున్న నెమలి–పి.టి.కొత్తూరు విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రులు తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను సానుకూలంగా స్వీకరించి, సాధ్యమైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం స్థాయిలో నిరంతర అనుసరణ కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.