తిరువూరులో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఆర్డీవో హెచ్చరిక
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దమ్ము చక్రాల ట్రాక్టర్లు, ఓవర్లోడ్ ఆటోలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరువూరు ఆర్డీవో ఏ.కుమార్ హెచ్చరించారు. స్కూల్, కాలేజీల సమయాల్లో దమ్ము ట్రాక్టర్లు, ఓవర్లోడ్ వాహనాల కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఆటోల్లో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, డ్రైవర్ సీటు పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. అలాగే ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని వాహనదారులకు సూచించారు.
దమ్ము చక్రాల ట్రాక్టర్ల వల్ల రోడ్లు వేగంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్న ఆర్డీవో, వర్షాకాలంలో రోడ్లపై అతివేగంగా ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏ.కుమార్ స్పష్టం చేశారు.