తొలి ఏకాదశి సందర్భంగా కోదండ రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఊటుకూరు, గంపలగూడెం మండలం: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలోని కోదండ రామస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మీ శ్రీనివాస సూరి ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామచంద్రమూర్తి, సీతాదేవి మూలవిరాట్లకు జలాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలతో స్వామివారిని అలంకరించి, చామంతి, గులాబీ పుష్పాలు, తులసీదళాలతో అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అదేవిధంగా గంపలగూడెం మండలంలోని నెమలి గ్రామ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, వినగడప గ్రామ ఆలయం, గోసవీడు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, పెనుగొలను మెట్టగుట్ట శేషాచల శ్రీనివాస స్వామి ఆలయం, రంగనాయక స్వామి ఆలయాల్లో కూడా తొలి ఏకాదశి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.