త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ కీలక కసరత్తు!
భారత్లో త్వరలో ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పెరుగుతున్న కరెన్సీ డిమాండ్, ముద్రణ వ్యయాలను తగ్గించడం, నకిలీ నోట్ల నియంత్రణ లక్ష్యంగా భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) పాలిమర్ నోట్ల ప్రవేశంపై మళ్లీ దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి.
ప్లాస్టిక్ నోట్ల ప్రత్యేకతలు: ▪️ నీటిలో తడిసినా, మడతలు పడినా సులభంగా పాడవవు
▪️ సాధారణ కాగితపు నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నిక
▪️ చిరిగిపోవడం, మురికిపడటం తక్కువ
▪️ హోలోగ్రామ్లు, పారదర్శక విండోలు వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో నకిలీ నోట్లకు చెక్
▪️ పదే పదే కొత్త నోట్లు ముద్రించాల్సిన అవసరం తగ్గడంతో వ్యయభారం తగ్గే అవకాశం
ఆర్బీఐ గతంలో 2012లో పాలిమర్ ₹10 నోట్లపై ప్రయోగాలు చేసినప్పటికీ, సాంకేతిక కారణాలతో ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. అయితే ప్రస్తుతం సాంకేతిక సమస్యలు పరిష్కారమవడంతో మళ్లీ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రారంభ దశలో ₹10, ₹20 వంటి చిన్న నోట్లను పరీక్షాత్మకంగా ప్రవేశపెట్టవచ్చని సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, కెనడా, యూకే, సింగపూర్ సహా 60కిపైగా దేశాలు ఇప్పటికే పాలిమర్ కరెన్సీని వినియోగిస్తున్నాయి. భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నట్లు తాజా సంకేతాలు చెబుతున్నాయి.