www.ntodaynews.com
కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం అంగీకారం
తెలంగాణ
అమృత్ భారత్ 2.0 కింద కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం అంగీకారం: ఎంపీ కేశినేని శివనాథ్
NTODAY NEWS: కొండపల్లి కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు రూ.10 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలు రైల్వే అధికారులతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంయుక్తంగా బుధవారం కొండపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంట ఉన్న డ్రైనేజీ సమస్యలు, స్టేషన్ అభివృద్ధి అంశాలను పరిశీలించారు.
ముందుగా కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి సంబంధించి ప్లాట్ఫారమ్ ఎత్తు పెంపు, ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన అంశాలను పరిశీలించారు. అనంతరం కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ డ్రైన్ల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. కొండపల్లి ఎస్టీ కాలనీ వద్ద రైల్వే ట్రాక్ కింద ఉన్న డ్రైనేజీలో వర్షాకాలంలో నీరు సక్రమంగా పారక ప్రజలు పడుతున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం గొల్లపూడిలోని బల్బ్ లైన్ల ప్రాంతాన్ని సందర్శించి, విజయవాడ రైల్వే స్టేషన్కు ప్రత్యామ్నాయంగా కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, విజయవాడ రైల్వే స్టేషన్కు గొల్లపూడి బల్బ్ లైన్ల స్టేషన్ ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అక్కడ మూడు రైల్వే ట్రాక్ల మధ్య సుమారు 150 ఎకరాల స్థలం రైల్వే స్టేషన్ అభివృద్ధికి అనుకూలంగా ఉందన్నారు. ఈ అంశాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లగా, అధికారులతో కలిసి స్థల పరిశీలన చేపట్టినట్లు వివరించారు.
కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో కూడా కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. స్టేషన్ అభివృద్ధి, ఆధునికీకరణకు సంబంధించి రూ.10 కోట్ల విలువైన ప్రతిపాదనలు ఇప్పటికే రైల్వే శాఖకు పంపినట్లు వెల్లడించారు. రాజధాని అమరావతికి అనుసంధానంగా కొండపల్లి రైల్వే స్టేషన్ కీలకంగా మారనుందని, త్వరలో ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఇక్కడ ఆగే అవకాశం ఉందన్నారు.
ఇప్పటికే కొండపల్లి–గొల్లపూడి రైలు మార్గంలో ఉన్న ఎల్సీ నెంబర్లు 147, 148 ఆర్వోబీలకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. ఎల్సీ నెంబర్ 140కు ఆర్యూబీ మంజూరు కాగా, ఎల్సీ నెంబర్ 150కు మంజూరైన రెండు లైన్ల ఆర్వోబీని నాలుగు లైన్లుగా విస్తరించాలని కోరినట్లు చెప్పారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, అమృత్ భారత్ 2.0 పథకం కింద కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.10 కోట్ల మంజూరుకు కేంద్ర రైల్వే శాఖ అంగీకరించిందని తెలిపారు. కొండపల్లి వాసుల కల అయిన ఆధునిక రైల్వే స్టేషన్ నిర్మాణం త్వరలోనే సాకారం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, మైలవరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు, కొండపల్లి టీడీపీ అధ్యక్షుడు బాలాజీ, గొల్లపూడి సీనియర్ నాయకులు వడ్లమూడి చలపతిరావు, జాలిపర్తి గోపాలకృష్ణ, రాయనపాడు నాయకులు కాటంనేని పూర్ణచంద్రరావు, శీలంనేని సాంబశివరావుతో పాటు కొండపల్లి కౌన్సిలర్లు, ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube