www.ntodaynews.com
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి
తెలంగాణ
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
NTODAY NEWS:కొండగట్టు ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తన ఇలవేల్పు అయిన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంను దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిపూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం, రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానాలు సహకారంతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఈ పర్యటన జరిగింది.ఉదయం 11 గంటల ప్రాంతంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పవన్ కళ్యాణ్ ఆలయానికి చేరుకున్నారు. తెలంగాణ దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యుడు కపీంద్ర స్వామి సంప్రదాయబద్ధంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారికి ఇరువైపులా ఉన్న వెంకటేశ్వరస్వామి, లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి తీర్థప్రసాదం ఇచ్చారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో టి. శ్రీకాంతరావులు స్వామివారి చిత్రపటాన్ని పవన్ కళ్యాణ్కు అందజేశారు. ఈ పర్యటనలో టీటీడీ బోర్డు సభ్యుడు బి. ఆనందసాయి, తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు గోవింద్ హరే, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, ఆర్.కె. సాగర్ తదితరులు కూడా ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube