www.ntodaynews.com
యుద్ధాన్ని వెంటనే ఆపాలి ప్రపంచ శాంతి కాపాడాలి
తెలంగాణ
యుద్ధాన్ని వెంటనే ఆపాలి – ప్రపంచ శాంతి కాపాడాలి: సిపిఐ నేతలు
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు
ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వెంటనే యుద్ధాన్ని నిలిపివేయాలని, ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజన్ డిమాండ్ చేశారు.
భారత కమ్యూనిస్టు పార్టీ పుంగనూరు నియోజకవర్గ కమిటీని అన్నమయ్య జిల్లాలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా శుక్రవారం పుంగనూరు భగత్ సింగ్ కాలనీలో రామ్మూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి. మహేష్, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి టీ. జనార్దన్ హాజరయ్యారు.
సమావేశం ప్రారంభంలో ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు సంతాపం తెలియజేశారు. అనంతరం నాగరాజన్ మాట్లాడుతూ ప్రపంచ శాంతికి కేంద్ర బిందువుగా నిలిచిన భారత ప్రభుత్వం యుద్ధాన్ని నివారించేందుకు గాని, ఒక దేశ అధ్యక్షుడిని హత్య చేసిన ఘటనను ఖండించేందుకు గాని ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. యుద్ధం కొనసాగితే అది అణుయుద్ధంగా మారి ప్రపంచ మానవాళికే ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి వెంటనే జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి. మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. పేదలకు టిడ్కో ఇండ్లు, ఇంటి స్థలాల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యంపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటుపరం అవుతున్నాయని, కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు “గడపగడపకు సిపిఐ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పార్టీ నిధుల సేకరణకు కృషి చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం మండలాలను అన్నమయ్య జిల్లా సిపిఐ సమితిలో విలీనం చేస్తున్నట్లు నాగరాజన్ ప్రతిపాదించగా, అన్నమయ్య జిల్లా కార్యదర్శి మహేష్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి టి. కృష్ణప్ప, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎం. సాంబశివ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి. రంగారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. మాధవ్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం పుంగనూరు పట్టణానికి చెందిన పార్టీ సీనియర్ సభ్యుడు డా. టీ. జనార్దన్కు పార్టీ సభ్యత్వాన్ని మహేష్ అందజేశారు.
సమావేశానికి పుంగనూరు సహాయ కార్యదర్శి మున్నా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కార్యదర్శి వెంకటరమణారెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
#Punganur #AnnamayyaDistrict #CPI #WorldPeace #StopWar #PoliticalNews #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube