మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులు మార్చి 31లోగా ప్రారంభం — ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి
NTODAY NEWS: హైదరాబాద్
హైదరాబాద్ మహానగర అభివృద్ధికి మూసీ నది పునరుజ్జీవం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేసి, టెండర్లు పిలిచి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అభివృద్ధి పనులు ప్రారంభించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
శాసనసభలో మూసీ పునరుజ్జీవం అంశంపై ప్రశ్నోత్తరాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు కలుగజేసుకొని, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్కు సంబంధించిన విస్తృత లక్ష్యాలు, ఉద్దేశాలను సభకు వివరించారు.
అభివృద్ధి చెందిన ప్రపంచ నగరాలను అధ్యయనం చేసిన అనంతరం, మూసీలో శుద్ధమైన నీరు నిరంతరం ప్రవహించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా నదీ పరివాహక ప్రాంతాల్లోనే మానవ నాగరికత అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ నగరానికి సంబంధించి నిజాం హయాంలోనే మూసీ తీరం వెంబడి గొప్ప అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. 1908 వరదల అనంతరం నగరానికి శాశ్వత పరిష్కారంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు నిర్మించారని పేర్కొన్నారు.
మూసీ నది కాలుష్యం వల్ల పరివాహక ప్రాంతాల్లో పర్యావరణం, ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోందని, పరిశ్రమల మలినాలు, ఘన వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందుకోసం కన్సల్టెన్సీలను నియమించి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
బాపూ ఘాట్ వద్ద మూసా–ఈసా నదుల సంగమంలో ఉన్న గాంధీ సరోవర్ను ‘V’ ఆకారంలో అభివృద్ధి చేయడంతో పాటు, ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మొత్తం 20 టీఎంసీలలో 15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, 5 టీఎంసీలను మూసీలో శుద్ధమైన నీరు నిరంతరం ప్రవహించేందుకు వినియోగించనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) రూ.4,000 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించిందని, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అవసరమైన అనుమతులు లభించాయని ముఖ్యమంత్రి గారు తెలిపారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కూడా ప్రణాళికలో ఉందన్నారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదలకు మెరుగైన నివాసాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ఓల్డ్ సిటీ సహా హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మంచిరేవుల సమీపంలోని పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, మూసీ తీరం వెంబడి గురుద్వారా, మసీదు, చర్చి నిర్మాణాల ద్వారా మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
డీపీఆర్ సిద్ధమైన అనంతరం శాసనసభ ముందుంచి చర్చకు పెట్టి, ప్రజాప్రతినిధులు, నిపుణుల సూచనలు తీసుకుని ముందుకు వెళతామని తెలిపారు. హైదరాబాద్ను పర్యావరణ అనుకూలంగా, ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు
Follow us on
Website
Facebook
Instagram
YouTube