ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి
ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యం: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
NTODAY NEWS: రామగుండం
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లకు చెందిన ప్రజలు పండుగలు, సెలవులు, వివాహాలు తదితర సందర్భాల్లో ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో సూచించారు.
ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే ముందు తలుపులు, కిటికీలు, గేట్లు సక్రమంగా మూసి ఉన్నాయా అనే విషయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలని తెలిపారు. అలాగే ఇళ్లలో లేదా ఇంటి పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా, రికార్డింగ్ జరుగుతోందా, నైట్ విజన్ సదుపాయం సక్రమంగా ఉందా అనే అంశాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు.
సీసీటీవీ కెమెరాలు సమర్థవంతంగా పనిచేస్తే నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో భయాన్ని కలిగించడంతో పాటు, ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం కలిగిన సీసీటీవీ కెమెరాలైతే మొబైల్ యాప్ ద్వారా లైవ్ ఫుటేజ్ వీక్షించే విధంగా ముందుగానే సెటప్ చేసుకోవాలని సూచించారు.
ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే విషయాన్ని పొరుగువారికి లేదా నమ్మకమైన వ్యక్తికి ముందుగా తెలియజేయడం, అవసరమైతే సంప్రదింపు ఫోన్ నంబర్ ఇవ్వడం భద్రతకు మరింత దోహదపడుతుందని చెప్పారు. అలాగే రాత్రి సమయాల్లో ఇంటి వెలుపల లైట్లు వెలిగేలా టైమర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇల్లు ఖాళీగా ఉందనే అనుమానం కలగకుండా ఉంటుందని వివరించారు.
ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కదలికలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని, లేదా డయల్ 100 లేదా 112కు ఫోన్ చేయాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యమవుతుందని, ప్రతి పౌరుడు భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube