తిరువూరు: అకాల భారీ వర్షంతో జలమయమైన లోతట్టు ప్రాంతాలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు పట్టణంలో శనివారం ఒక్కసారిగా కురిసిన అకాల భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. భారీగా వర్షం కురవడంతో పట్టణంలోని ప్రధాన రహదారిపై వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తిరువూరు బస్టాండులోకి సైతం వరద నీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బస్టాండు పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గాలు సక్రమంగా లేకపోవడంతో పలుచోట్ల నీరు నిలిచిపోయింది.
ఇటీవల వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. ముఖ్యంగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు భారీ వర్షం ఉపశమనం కలిగించింది. వర్షం కారణంగా పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.