ఉరుమడ్ల గ్రామంలో ఘనంగా ముగిసిన ఉచిత వేసవి హాకీ శిక్షణా శిబిరం
క్రీడాకారులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్, హాకీ స్టిక్స్ పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, యువజన మరియు క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గత మార్చి 24న ప్రారంభమైన ఉచిత వేసవి హాకీ శిక్షణా శిబిరం ఆదివారం స్థానిక ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఘనంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణా శిబిరంలో శిక్షణ తీసుకున్న క్రీడాకారులకు గ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు ఉచితంగా స్పోర్ట్స్ యూనిఫామ్లను అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ మన జాతీయ క్రీడ అయిన హాకీకి సంబంధించిన శిక్షణా శిబిరాన్ని ఉరువడ్ల గ్రామంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు హాకీలో అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం గర్వకారణమన్నారు. క్రీడలు కేవలం వినోదం కోసమే కాకుండా, విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసంతో పాటు పోటీతత్వాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇలాంటి ఉచిత శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకుని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ వేసవి శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ భానుశ్రీ, తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షుడు పల్లపు బుధుడు, మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగొని స్వామి, కాంగ్రెస్ జిల్లా నాయకులు పొలగోని నరసింహల హాకీ స్టిక్స్ను పంపిణీ చేశారు. అలాగే మద్ది ప్రవీణ్ కుమార్ రెడ్డి క్రీడాకారులకు సాక్స్లను స్పాన్సర్ చేయగా, ఎస్ఎంఎస్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ ముగింపు వేడుకల్లో ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, అగ్రికల్చర్ ఏఈఓ మందుగుల శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు గంగాపురం రాము, మర్రి కల్పన, మర్రి సంధ్య తో పాటు సీనియర్ క్రీడాకారులు జనగాం స్వామి, గంగాపురం వెంకన్న, జలపాల రాము, రెండో వార్డు మెంబర్ స్వాతి శ్రీనివాస్, ఈర్ల గోపాల్, పట్లా జనార్ధన్ మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.