మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు తగ్గించొద్దు
మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు తగ్గించొద్దు
- పాత వేతనాలనే యధావిధిగా కొనసాగించాలి
- జీతాల్లో కోత విధిస్తే ఐక్య ఉద్యమాలు తప్పవు: సీఐటీయు, కార్మిక సంఘాల హెచ్చరిక
మంచిర్యాల పట్టణంలోని సీఐటీయు కార్యాలయంలో బుధవారం కామ్రేడ్ కాసర్ల రాజలింగు అధ్యక్షతన జిల్లా సీఐటీయు, మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘాల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) జిల్లా కార్యదర్శి కాసర్ల రాజలింగు, మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా నాయకుడు నిరటి రాజన్న మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు కేటగిరీల వారీగా పెంచిన వేతనాలను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించి చెల్లించేలా సర్క్యులర్ జారీ చేయడం దారుణమన్నారు. కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం ఏమాత్రం సరికాదని, తక్షణమే ఈ నిర్ణయాన్ని పునరాలోచించి ఎలాంటి కోతల్లేకుండా పాత వేతనాలనే యధావిధిగా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లి కార్మికుల జీతాలు తగ్గిస్తే.. జిల్లాలోని మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగ, కార్మిక సంఘాలన్నీ ఏకమై ఐక్య కార్యాచరణతో పెద్ద ఎత్తున పోరాడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక నాయకులు సురేష్, నవీన్, సీఐటీయు నాయకులు చిందం వెంకటేష్, పసుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు