ఉత్తమ గ్రంథాలయ అధికారిగా అల్లూరు రామచంద్రుడు ఎంపిక
పెనుగొలను గ్రామానికి అరుదైన గౌరవం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని నందిగామ శాఖ గ్రంథాలయంలో ద్వితీయ శ్రేణి గ్రంథాలయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన అల్లూరు రామచంద్రుడు ఉత్తమ గ్రంథాలయ అధికారిగా ఎంపికయ్యారు.
వేసవి విజ్ఞాన తరగతులను సమర్థవంతంగా నిర్వహించి విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించడంలో విశేష కృషి చేసినందుకు ఆయన సేవలను గుర్తించిన కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఈ ఏడాది ఉత్తమ గ్రంథాలయ అధికారిగా ప్రకటించింది.
మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జయంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అల్లూరు రామచంద్రుడిని శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, కార్యదర్శి వేములపల్లి రవికుమార్, ప్రొఫెసర్ అయ్యంకి వెంకట మురళీకృష్ణతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
పెనుగొలను గ్రామానికి చెందిన అల్లూరు రామచంద్రుడు ఈ గౌరవాన్ని అందుకోవడంతో గ్రామంలో హర్షాతిరేకం వ్యక్తమైంది. శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావుతో పాటు పలువురు ప్రముఖులు, గ్రామస్థులు ఆయనకు అభినందనలు తెలిపారు.