వాట్సప్తో ఓపీ టోకెన్… క్యూలకు చెక్!
వాట్సప్తో ఓపీ టోకెన్… క్యూలకు చెక్!
అమరావతి, మార్చి 18: ఆసుపత్రుల్లో గంటల తరబడి క్యూల్లో నిలబడే రోజులకు చెక్ పడింది. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘మన మిత్ర’ వాట్సప్ సేవలతో ఇక ఓపీ రిజిస్ట్రేషన్ ఇంటి నుంచే సెకన్లలో పూర్తవుతోంది.
9552300009 నంబర్కు వాట్సప్లో ‘హాయ్’ అని మెసేజ్ చేస్తే చాలు… ఆరోగ్య సేవల మెనూ తెరుచుకుంటుంది. అందులో ‘ఓపీ అపాయింట్మెంట్’ ఎంపిక చేసుకుని జిల్లా, ఆసుపత్రి, విభాగం ఎంచుకుంటే వెంటనే టోకెన్ బుక్ అవుతుంది. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీతో లాగిన్ అయి వివరాలు నమోదు చేస్తే… క్షణాల్లో అపాయింట్మెంట్ ఖాయం.
ఇప్పటి వరకు రోగులు, వారి బంధువులు ఆసుపత్రుల వద్ద ఉదయం నుంచే క్యూల్లో నిలబడి టోకెన్లు తీసుకోవాల్సి వచ్చేది. పైగా వైద్యుల అందుబాటు, మందుల లభ్యతపై స్పష్టత లేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ కొత్త విధానంతో ఆ సమస్యలకు గుడ్బై చెప్పొచ్చు.
రక్తం నుంచి మందుల వరకు… ఒకే ప్లాట్ఫామ్
‘మన మిత్ర’లోనే రక్త నిల్వల వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జిల్లా ఎంపిక చేస్తే ఏ గ్రూప్ రక్తం ఎక్కడ అందుబాటులో ఉందో వెంటనే తెలుసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఇది ప్రాణాలను కాపాడే సేవగా నిలవనుంది.
అలాగే మందులు, శస్త్రచికిత్స సామగ్రి లభ్యతపై కూడా సమాచారం పొందొచ్చు. ఆసుపత్రికి వెళ్లే ముందు అవసరమైనవి ఉన్నాయా లేదా అన్నది ముందే తెలుసుకునే వీలుంది.
ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు… వాట్సప్లోనే అప్డేట్
ఆరోగ్య కార్డు సేవల విభాగంలో ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు అప్డేట్, స్టేటస్ చెక్, ఫిర్యాదుల నమోదు వంటి సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అవసరమైన పత్రాలు అప్లోడ్ చేసి సమస్యలను సులభంగా పరిష్కరించుకునే అవకాశం కల్పించారు.
డిజిటల్ హెల్త్ రికార్డ్స్కు నాంది
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ‘ఆభా’ నంబర్ పొందే అవకాశం కూడా కల్పించారు. మొబైల్, ఆధార్ వివరాలతో రిజిస్టర్ అయితే 14 అంకెల యూనిక్ హెల్త్ ఐడీ లభిస్తుంది. దీని ద్వారా ఎక్కడి నుంచైనా వైద్య సేవలు పొందడం మరింత సులభం అవుతుంది.
మొత్తంగా…
“ఒక ‘హాయ్’ మెసేజ్తోనే ఆసుపత్రి సేవలు మీ చేతిలోకి” అంటూ ప్రభుత్వం డిజిటల్ హెల్త్ రంగంలో మరో అడుగు ముందుకేసింది.