వైభవంగా మల్లన్న స్వర్ణ రథోత్సవం
వైభవంగా మల్లన్న స్వర్ణ రథోత్సవం
కార్యనిర్వహణాధికారివారి కార్యాలయం
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం
తేది: 26.03.2026
ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం (26.03.2026) శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించబడింది.
కాగా ఆరుద్రోత్సవంలో భాగంగా ఈ రోజు వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయి. అనంతరం స్వర్ణరథోత్సవం జరిపించబడింది.
ఈ స్వర్ణరథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణానికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించబడ్డాయి.
అనంతరం భక్తుల శివనామస్మరణతో వేదమంత్రాల నడుమ ఉదయం గం.7.30లకు ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుండి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపించడం జరిగింది.
సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, తప్పెట చిందులు, మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా రథోత్సవంలో సంప్రదాయ నృత్యం, ఏర్పాటు చేయబడింది.
ఈనాటి స్వర్ణరథోత్సవంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్నాయుడు, పలువురు దర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, పలువిభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)
శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ