వడగాల్పుల సమయంలో జాగ్రత్తలు పాటించాలి
దళిత బహుజన రిసోర్సెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఉపాధి కూలీలకు వడగాల్పుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీబీఆర్సీ కోఆర్డినేటర్ ఝాన్సీ రాణి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉపాధి కూలీలు ఉదయం వీలైనంత త్వరగా పనులకు హాజరై, ఎండ ఉధృతం కాకముందే పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫేస్ యాప్ కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని తెలిసినా, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమయపాలన పాటించాలని కోరారు.
అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనుల్లో పాల్గొనవచ్చని, పీఎఫ్ ఉన్న ఉద్యోగస్తులు తప్ప మిగిలిన వారందరూ అర్హులేనని వివరించారు. ఉపాధి కూలీల వేతనాలపై కూడా అడిగి తెలుసుకున్నారు.
వడగాల్పుల సమయంలో ఎక్కువగా మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచిస్తూ, “మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే” అని అన్నారు.
ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవులు కొనసాగుతున్నందున పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రన్న, మేట్లు, పురుషులు, మహిళా ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉపాధి కూలీలకు డీబీఆర్సీ కోఆర్డినేటర్ ఝాన్సీ రాణి స్నాక్స్ పంపిణీ చేశారు.