విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీలో నాణ్యత పాటించాలి
విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీలో నాణ్యత పాటించాలి--జిల్లా విద్యాశాఖ అధికారి కందుల సత్యనారాయణ
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందించే ఏకరూప దుస్తులను పకడ్బందీగా కుట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి కందుల సత్యనారాయణ అన్నారు.ప్రతీ విద్యార్థి కొలతలు తీసుకుని,ఆ కొలతల ప్రకారం దుస్తులు కుట్టాలని శిక్షణ పొందుతున్న స్వయం సహాయక సంఘం మహిళలకు సూచించారు.దుస్తులు కుట్టడానికి వాడే దారం,గుండీలు నాణ్యమైన వాటిని ఉపయోగించాలన్నారు. దుస్తులకు వేసే కుట్లు కూడా దగ్గరగా వేసి,మధ్యలో చినిగిపోకుండా చూడాలన్నారు. ముఖ్యంగా మహిళలు తమ స్వంత పిల్లలకు దుస్తులు తయారు చేసిన విధంగా భావిస్తూ,నాణ్యమైన వాటిని అందించాలన్నారు.భువనగిరి పట్టణంలో ఉన్న విదిత కుట్టు శిక్షణా కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కేంద్రాన్ని ఆయన ఈరోజు సందర్శించి,శిక్షణ జరిగే తీరును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి పెసరు లింగారెడ్డి,డి ఆర్ డి ఎ జిల్లా ఏ.పీ.ఎం.పసునూరి రమణ తదితరులు పాల్గొన్నారు.