విద్యార్థులపై లాఠీచార్జిని ఖండించిన సీపీఐ(ఎంఎల్) లిబరేషన్
విద్యార్థులపై లాఠీచార్జిని ఖండించిన సీపీఐ(ఎంఎల్) లిబరేషన్
ఎన్టీఆర్ జిల్లా, విసన్నపేట:
ఢిల్లీలో చలో పార్లమెంట్ పిలుపు సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి, భాష్పవాయువు ప్రయోగం చేయడాన్ని నిరసిస్తూ విజయవాడలో నిర్వహించిన చలో రాజ్భవన్ కార్యక్రమంలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జి, అరెస్టులను సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.
విసన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ మాట్లాడుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న విద్యార్థి సంఘాలు ఇచ్చిన విద్యాసంస్థల బంద్ పిలుపును రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయాలని కోరారు.
ఢిల్లీలో మహిళలు, విద్యార్థినులపై పోలీసులు జరిపిన లాఠీచార్జి ఘటనలపై స్పందిస్తూ, బాధ్యులైన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఉద్యమకారులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, విద్య కార్పొరేటీకరణ, కాషాయీకరణను అరికట్టి విద్యా రంగానికి బడ్జెట్లో మరింత నిధులు కేటాయించాలని కోరారు. సంబంధిత వర్గాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హరినాథ్ పేర్కొన్నారు. ఐసా విద్యార్థి నాయకురాలు నేహా పోరాటస్ఫూర్తిని అభినందిస్తూ, దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకు గట్టి సందేశం ఇచ్చాయని అన్నారు. నిర్బంధాలను లెక్కచేయకుండా నిర్వహించిన చలో పార్లమెంట్ ఉద్యమం దేశవ్యాప్తంగా విశేష స్పందన పొందిందని తెలిపారు.