విధి నిర్వహణలోనే డీటీఓ వెంకన్న మృతి
భూపాలపల్లి, జూన్ 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా అధికారి వెంకన్న (45) మృతి చెందారు. గణపురం మండలం చెల్పూరు శివారులోని రవాణా శాఖ కార్యాలయం ఎదుట వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బొగ్గు టిప్పర్ లారీ అదుపుతప్పి ఆయనపైకి దూసుకెళ్లింది.
వివరాల ప్రకారం, రవాణా శాఖ సిబ్బందితో కలిసి వెంకన్న తనిఖీలు చేపడుతుండగా పరకాల వైపు నుంచి వచ్చిన టిప్పర్ లారీ ముందుగా రోడ్డుపక్కన ఉన్న హార్వెస్టర్ వాహనాన్ని, అనంతరం డీటీఓ అధికారిక వాహనాన్ని ఢీకొట్టి వెంకన్నను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు లారీ టైర్లు ఆయనపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనతో అక్కడ ఉన్న సిబ్బంది, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంకన్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందినవారు. ఇటీవలే జగిత్యాల జిల్లా నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు.
ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు విఫలమవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వెంకన్న మృతిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించిన మంత్రి, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.