వ్యర్థాల నిర్వహణపై చిట్యాల మున్సిపల్ పాలక వర్గానికి అవగాహన
వ్యర్థాల నిర్వహణపై చిట్యాల మున్సిపల్ పాలక వర్గానికి అవగాహన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన ఒక రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఘన వ్యర్థాల సేకరణ మరియు నిర్వహణ, కెపాసి బిల్డింగ్ అనే అంశంపై ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన నిపుణులు మున్సిపాలిటీల్లో చెత్తను వర్గీకరించడం, తడి చెత్త, పొడి చెత్త సేకరణ విధానాలు, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ మరియు పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కౌన్సిలర్లకు విస్తృతంగా అవగాహన కల్పించారు. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన , స్థానిక సమస్యల పరిష్కారం మరియు ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమని వివరించారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడానికి ఈ శిక్షణలో నేర్చుకున్న మెళకువలు ఎంతగానో ఉపయోగపడతాయని చిట్యాల మున్సిపల్ ప్రజా ప్రతినిధులు తెలిపారు. వార్డుల్లో ఘన వ్యర్థాల సేకరణను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీతా, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, వార్డు కౌన్సిలర్లు నాగిల్ల సుధాకర్ (కావేరి), షేక్ షబానా, గాలి పద్మ, కోనేటి ఎల్లయ్య, జేరిపోతుల సత్యనారాయణ, దేశపాక శ్రీలత, ఏర్పుల పరమేష్ , నిమ్మనగోటి శ్రీను, బొబ్బలి సందీప, కో ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, షహజాది , ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు...