ఆసుపత్రి వర్కర్లకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలి
ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలివ్వాలి
బెల్లంపల్లి ఆసుపత్రి సూపరింటెండెంట్కు సీఐటీయు వినతి
ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్లకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు కార్మికులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పేషంట్ కేర్, శానిటేషన్, స్వీపర్, సెక్యూరిటీ తదితర ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఏళ్లు గడుస్తున్నా కనీస వేతనాలు అమలు కావడంలేదన్నారు. జీఓ నెం.60 ప్రకారం రూ.15,600 వేతనం ఇవ్వాల్సి ఉండగా, కాంట్రాక్టర్ల కమీషన్లు, పీఎఫ్, ఈఎస్ఐ కోతల పేరుతో కార్మికులకు కేవలం రూ.11,000 మాత్రమే చేతికి ఇస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పీఎఫ్, ఈఎస్ఐ యజమాని వాటాను ప్రభుత్వమే భరించాలని, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు. అలాగే ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, కార్మిక శాఖ ఉత్తర్వుల ప్రకారం సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవలే హైదరాబాద్లో ధర్నా చేసిన సందర్భంగా జూన్ నుంచి వేతనాలు పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో కార్మికులకు యూనిఫామ్, రక్షణ పరికరాలతో పాటు ప్రత్యేక భోజన, రెస్ట్ రూమ్లు, క్రెచ్ సౌకర్యాలు కల్పించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి మౌలాలి, ఆసుపత్రి వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు జానకి, సభ్యులు శేఖర్, స్వరూప, సృజన, లావణ్య, దీప, రాజశేఖర్, రజిత, సుజాత, స్వాతి, మల్లేష్, భాగ్యలక్ష్మి, సునీత, కవిత, పూజ తదితరులు పాల్గొన్నారు