అంబేద్కర్ స్ఫూర్తి తో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెంపుదలకు , సామాజిక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరో ఉద్యమం
అంబేద్కర్ స్ఫూర్తి తో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెంపుదలకు , సామాజిక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరో ఉద్యమం
మంచిర్యాల, ఏప్రిల్ 14: మంచిర్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా భౌగోళిక తెలంగాణ సాధించుకున్నప్పటికీ, సామాజిక తెలంగాణ లక్ష్యం ఇంకా నెరవేరలేదని, దానికోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 1998 ఒప్పందం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి పెన్షన్ పెంచాల్సి ఉన్నా, గత 28 ఏళ్లుగా ఒక్క పైసా కూడా పెంచకుండా కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు కార్మికుల రక్తాన్ని పీల్చుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ అభివృద్ధికి 35 ఏళ్ల పాటు శ్రమించిన కార్మికులకు నేడు కేవలం రూ. 350 నుండి రూ. 1000 లోపు పెన్షన్ రావడం అత్యంత బాధాకరమని, తక్షణమే కరువు భత్యంతో కూడిన 50 శాతం పెన్షన్ పెంపును అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వృద్ధులైన మాజీ ఉద్యోగులకు ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఉద్యమకారులు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు రాళ్లబండి రాజన్న, అధ్యక్షులు గజేల్లి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పూదరి నరసయ్య, ఉపాధ్యక్షుడు ఏ. గంగయ్య, నాయకులు మాదరమైన మల్లేష్, మోత్కూరి రాంబాబు, ఇందూరి రామయ్య, దొరిశెట్టి పోచయ్య, పోతురాజు చంద్రయ్య, రాచకట్ల రాజయ్య, ఆర్. రామ్ లాల్, పులి కృష్ణయ్య తదితర ఉద్యమకారులు, విశ్రాంత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు