అన్నింటికీ సిద్ధంగా ఉండండి..! ప్రధాని మోదీ షాకింగ్ పిలుపు
అన్నింటికీ సిద్ధంగా ఉండండి..! ప్రధాని మోదీ షాకింగ్ పిలుపు
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో హెచ్చరించారు. దేశం ఎదుర్కొనే సవాళ్లకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రభావిత ప్రాంతాల్లో కొందరు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం నిరంతరం అక్కడి భారతీయులతో సంప్రదింపులు జరుపుతూ సహాయక చర్యలు చేపడుతోందన్నారు. ఇప్పటివరకు 3 లక్షలకు పైగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అలాగే ఇరాన్ నుండి వెయ్యికి పైగా భారతీయులను రక్షించినట్లు చెప్పారు.
మధ్యప్రాచ్య దేశాల్లో ఉన్న విద్యార్థుల భద్రత దృష్ట్యా సీబీఎస్ఈ పరీక్షలను కూడా రద్దు చేసినట్లు గుర్తుచేశారు.
భారత్ ఇంధన అవసరాలపై కూడా యుద్ధ ప్రభావం ఉండొచ్చని ప్రధాని తెలిపారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ద్వారా దేశం పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై భారాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
దేశ ఇంధన అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నామని, సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత దశాబ్దంలో 27 దేశాల నుండి ఇంధన దిగుమతులు జరిపిన భారత్, ప్రస్తుతం 41 దేశాల వరకు విస్తరించిందన్నారు.
ప్రస్తుతం దేశంలో 53 లక్షల టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయని వెల్లడించిన ప్రధాని, రిఫైనరీ సామర్థ్యాలు కూడా గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు.
ఇంధనం, గ్యాస్, ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ ప్రాంతం, హార్ముజ్ జలసంధి పరిణామాలపై నిశితంగా నిఘా ఉంచిందన్నారు. దిగుమతులు-ఎగుమతులపై రోజువారీ సమీక్ష కోసం ప్రత్యేక అంతర్మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనం వెన్నెముకలాంటిదని, దీర్ఘకాలిక, స్వల్పకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు ప్రధాని స్పష్టం చేశారు.