బలపడుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ముప్పు
బలపడుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ముప్పు
వర్షాలు తగ్గి.. పెరగనున్న ఎండ తీవ్రత
ఫిబ్రవరి 2027 వరకు ప్రభావం ఉండే అవకాశం: ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
గోధుమ దిగుబడులపై తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు బలపడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ప్రభావం ఫిబ్రవరి 2027 వరకు కొనసాగేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా భారత్లో వర్షాలు తగ్గి ఎండ తీవ్రత గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పడిపోతున్న వర్షపాతం.. పెరుగుతున్న సెగ
ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దేశంలోని వర్షపాత పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఆగస్టులో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా అసాధారణ స్థాయికి చేరుతున్నాయి. సెప్టెంబరులోనూ సాధారణ సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రబీ పంటలకు పెను ముప్పు
ఎల్నినో ప్రభావం వర్షాకాలానికే పరిమితం కాకుండా శీతాకాలంలోనూ కనిపించే అవకాశం ఉంది. దేశంలో చలికాలపు రోజుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు కొనసాగితే రబీలో కీలకమైన గోధుమ పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. గోధుమ ఉత్పత్తి తగ్గితే దేశ ఆహార భద్రతపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముందస్తు చర్యలు తప్పనిసరి
ఎల్నినో ప్రభావం దీర్ఘకాలం కొనసాగే అవకాశాల నేపథ్యంలో రైతాంగం, ప్రభుత్వ యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నీటి వనరులను సమర్థంగా నిర్వహించడం, తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించడం, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. వర్షపాతం తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు ముందుగానే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.