చాట్రాయి: ఏవో బి. శివశంకర్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన.. కోడిగుడ్డు ద్రావణం తయారీ ప్రదర్శన
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో భాగంగా కోడిగుడ్డు–నిమ్మరసం ద్రావణం తయారీ విధానాన్ని రైతులకు స్వయంగా చేసి చూపించారు. ఈ ద్రావణం వినియోగం ద్వారా పంటల్లో సూక్ష్మ పోషకాల లోపాలను అధిగమించి, పంటలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చని వివరించారు.
చాట్రాయి మండల పరిధిలోని వరి, ప్రత్తి, మినుము, ఆయిల్ఫామ్, మామిడి తదితర పంటలను రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని ఏవో బి. శివశంకర్ సూచించారు. సెప్టెంబర్ 15వ తేదీలోపు పంట నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు.
పంట నమోదు చేసుకోవడం వల్ల రైతులకు ప్రభుత్వం అందించే కనీస మద్దతు ధరతో ధాన్యం విక్రయ సౌకర్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు పరిహారం, పంట బీమా, కౌలు రైతులకు సబ్సిడీలు, వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
ప్రతి రైతు ఏపీఎఫ్ఆర్ ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని, ఆ సంఖ్యను రైతు పొలంతో అనుసంధానం చేయడం వల్ల పంట బీమా, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.
ఎల్నినో ప్రభావం కారణంగా రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. తక్కువ నీటితో పంటల సాగు, వర్షపు నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని కోరారు.
కోడిగుడ్డు–బెల్లం ద్రావణం, జీవామృతం, ఘన జీవామృతం వంటి ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటించడం ద్వారా పంటలకు పోషకాలు అందడంతో పాటు నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.