www.ntodaynews.com
ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి
తెలంగాణ
ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి
ప్రత్యేక సిలబస్తో నాణ్యమైన విద్య: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి NTODAY NEWS: కరీంనగర్ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రీ-ప్రైమరీ చిన్నారులకు యూనిఫామ్, పుస్తకాలు, స్టేషనరీ కిట్లు అందజేశారు.
అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 33 ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. శిక్షణ పొందిన నైపుణ్య ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందిస్తున్నారని చెప్పారు. ప్రత్యేక సిలబస్ ద్వారా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్య అందుతున్నదని, యూనిఫామ్, పుస్తకాలు వంటి సౌకర్యాలు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ప్రీ-ప్రైమరీ చిన్నారులకు ఉచితంగా షూలు కూడా అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ స్కూళ్లలో పిల్లల నమోదు, హాజరు పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సందర్శన
పర్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. మూడవ తరగతి విద్యార్థులతో కలిసి పాఠాలు చదివించారు. రోజూ చదవడం, రాయడం తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు పాఠాన్ని చెప్పడమే కాకుండా విషయాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించడం ముఖ్యమని తెలిపారు. బుధవారం బోధనను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సూరం స్వప్న, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ఎం మంజుల తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube