దీదీకి ఝలక్ 144 రేసు గుర్రాలు రెడీ
కోల్కతా: భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన వేళ తన రేసు గుర్రాలను ప్రకటించింది. 2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొననుంది. ఈ నేపథ్యంలో బీజేపీ 144 మందితో తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 10 మంది మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుంచి అగ్నిమిత్ర పాల్, భవానీపూర్ నియోజకవర్గం నుంచి బెంగాల్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి, ఖరగ్పూర్ సదర్ నుంచి దిలీప్ ఘోష్ వంటి ప్రముఖులకు అవకాశం కల్పించారు.
మరోవైపు ఈసారి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తగ్గిపోవడం ప్రధాన వివాదంగా మారింది. గత ఏడాది నవంబర్లో ఓటర్ల సంఖ్య 7.66 కోట్లుగా ఉండగా, ఫిబ్రవరి 28న విడుదల చేసిన తుది జాబితాలో అది 6.44 కోట్లకు తగ్గింది. దీంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.