దళిత, గిరిజన సామాజిక న్యాయమే లక్ష్యం
దళిత, గిరిజన సామాజిక న్యాయమే లక్ష్యం: రూ.19,721 కోట్లతో కాంగ్రెస్ బడ్జెట్ దిశానిర్దేశం - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హైదరాబాద్, మార్చి 20: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో రూపొందించిన 2026-27 బడ్జెట్ అట్టడుగు వర్గాల అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తుందని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఇది రాహుల్ గాంధీ ప్రతిపాదించిన సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే బడ్జెట్ అని కొనియాడారు.
బడ్జెట్ ముఖ్యాంశాలు:
భారీ కేటాయింపులు: ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,935 కోట్లు కలిపి మొత్తం రూ.19,721 కోట్లు కేటాయించారు.
అంబేద్కర్ నాలెడ్జ్ టవర్: లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అత్యాధునిక సౌకర్యాలతో నాలెడ్జ్ టవర్ నిర్మించి, దళిత విద్యార్థులకు సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు అత్యున్నత స్థాయి కోచింగ్ అందిస్తాం.
దివ్యాంగుల సంక్షేమం: దివ్యాంగుల వివాహాలకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని రూ.2 లక్షలకు పెంచడం జరిగింది.
మౌలిక వసతులు: రూ.368.27 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 910 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు, అంబేద్కర్ భవనాల నిర్మాణం చేపట్టనున్నాం.
విద్య & ఆరోగ్యం: తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కోసం రూ.500 కోట్లు, విద్యార్థుల అల్పాహార పథకానికి (పాలు, రాగి జావ) రూ.800 కోట్లు కేటాయించారు. 23.50 లక్షల మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత కల్పించనున్నాం.
ఉద్యోగులకు భరోసా:
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం భారీ బీమా పథకాలను ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. ప్రమాద మరణం సంభవించినట్లయితే రూ.1.20 కోట్లు, టర్మ్ ఇన్సూరెన్స్ కింద రూ.10 లక్షల కవరేజ్ లభించేలా రూ.1,056 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
"ఈ బడ్జెట్ కేవలం లెక్కల పత్రం కాదు, ఇది అభివృద్ధి దిశగా తెలంగాణను నడిపించే కార్యాచరణ ప్రణాళిక" అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.